నెహెమ్యా 1

నెహెమ్యా ప్రార్థన

1 హకల్యా కుమారుడైన నెహెమ్యాయొక్క చర్యలు. ఇరువదియవ సంవత్సరములో కిస్లేవు మాసమున నేను షూషను కోటలో ఉండగా 

2.నా సహోదరులలో హనానీయను ఒకడును యూదులలో కొందరును వచ్చిరి. చెరపట్టబడిన శేషములో తప్పించుకొనిన యూదులనుగూర్చియు, యెరూషలేమునుగూర్చియు నేను వారి నడుగగా 

3.వారు–చెరపట్టబడినవారిలో శేషించినవారు ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందు చున్నారు; మరియు యెరూషలేముయొక్క ప్రాకారము పడద్రోయబడినది; దాని గుమ్మములును అగ్నిచేత కాల్చ బడినవని నాతో చెప్పిరి.౹ 

4.ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి యేడ్చి, కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి, ఆకాశమందలి దేవుని యెదుట విజ్ఞాపన చేసితిని.౹ 

5.ఎట్లనగా–ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడవైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా,౹ 

6.నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలీయుల పక్షముగా నేనుచేయు ప్రార్థన అంగీ కరించుము. నీకు విరోధముగ పాపముచేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి యింటివారును పాపము చేసియున్నాము.౹ 

7.నీ యెదుట బహు అసహ్యముగా ప్రవర్తించితిమి, నీ సేవకుడైన మోషేచేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలనైనను కట్టడలనైనను విధులనైనను మేము గైకొనక పోతిమి.౹ 

8.నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చినమాటను జ్ఞాపకము తెచ్చుకొనుము; అదేదనగా–మీరు అపరాధము చేసినయెడల జనులలోనికి మిమ్మును చెదర గొట్టుదును.౹ 

9.అయితే మీరు నావైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచినయెడల, భూదిగంతములవరకు మీరు తోలివేయబడినను అక్కడ నుండి సహా మిమ్మునుకూర్చి, నా నామము ఉంచుటకు నేను ఏర్పరచుకొనిన స్థలమునకు మిమ్మును రప్పించెదనని నీవు సెలవిచ్చితివి గదా.౹ 

10.చిత్తగించుము, నీవు నీ మహా ప్రభావమును చూపి, నీ బాహుబలముచేత విడిపించిన నీ దాసులగు నీ జనులు వీరే.౹ 

11.యెహోవా చెవియొగ్గి నీ దాసుడనైన నా మొఱ్ఱను, నీ నామమును భయభక్తులతో ఘనపరచుటయందు ఆనందించు నీ దాసుల మొఱ్ఱను ఆలకించి, ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరచి, ఈ మనుష్యుడు నాయందు దయచూపునట్లు అనుగ్రహించుమని నిన్ను బతిమాలుకొనుచున్నాను, అని ప్రార్థించితిని. నేను రాజునకు గిన్నె అందించువాడనై యుంటిని.

నెహెమ్యా 2

అర్తహషస్త రాజు నెహెమ్యాను యెరూషలేమునకు పంపుట

2 అటుతరువాత అర్తహషస్త రాజు ఏలుబడికాలమున ఇరువదియవ సంవత్సరములో నీసాను మాసమందు రాజు ద్రాక్షారసము త్రాగవలెనని చూచుచుండగా నేను ద్రాక్షారసము తీసికొని రాజునకు అందించితిని. అంతకు పూర్వము నేనెన్నడును అతనియెదుట విచారముగా ఉండలేదు.౹ 

2.కాగా రాజు–నీకు వ్యాధిలేదు గదా, నీ ముఖము విచారముగా ఉన్నదేమి? నీ హృదయదుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా 

3.నేను మిగుల భయపడి–రాజు చిరంజీవి యగునుగాక, నా పితరుల సమాధులుండు పట్టణము పాడైపోయి, దాని గుమ్మములును అగ్నిచేత కాల్చబడి యుండగా నాకు దుఃఖముఖము లేకపోవునా అని రాజుతో అంటిని.౹ 

4.అప్పుడు రాజు –ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావని నన్నడుగగా, నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి 

5.రాజుతో–నీ సముఖమందు నేను దయపొందినయెడల, నా పితరుల సమాధులుండు పట్టణమును తిరిగి కట్టునట్లుగా నన్ను యూదాదేశమునకు పంపుడని వేడుకొనుచున్నానని నేను మనవి చేసితిని.౹ 

6.అందుకు రాజు రాణి తన యొద్ద కూర్చునియుండగా–నీ ప్రయాణము ఎన్నిదినములు పట్టును? నీవు ఎప్పుడు తిరిగి వచ్చెదవని అడిగెను. నేను ఇంత కాలమని చెప్పినప్పుడు రాజు నన్ను పంపుటకు చిత్తముగలవాడాయెను.౹ 

7.ఇదియుగాక రాజుతో నేనిట్లంటిని – రాజున కనుకూలమైతే యూదాదేశమున నేను చేరువరకు నన్ను దాటించునట్లుగా నది యవతలనున్న అధికారులకు తాకీదులను,౹ 

8.పట్టణప్రాకారమునకును, మందిరముతో సంబంధించిన కోటగుమ్మములకును, నేను ప్రవేశింపబోవు ఇంటికిని, దూలములు మ్రానులు ఇచ్చునట్లుగా రాజుగారి అడవులను కాయు ఆసాపునకు ఒక తాకీదును ఇయ్యుడని అడిగితిని; ఆలాగు నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణా హస్తముకొలది రాజు నా మనవి ఆలకించెను.౹ 

9.తరువాత నేను నది యవతలనున్న అధికారులయొద్దకు వచ్చి వారికి రాజుయొక్క తాకీదులను అప్పగించితిని. రాజు నాతోకూడ సేనాధిపతులను గుఱ్ఱపురౌతులను పంపించెను.

10.హోరోనీయుడైన సన్బల్లటును, అమ్మోనీయుడైన టోబీయా అను దాసుడును ఇశ్రాయేలీయులకు క్షేమము కలుగజేయు ఒకడు వచ్చెనని విని బహుగా దుఃఖపడిరి.౹

నెహెమ్యా యెరూషలేము ప్రాకారములను పరిశీలించుట

11.అంతట నేను యెరూషలేమునకు వచ్చి మూడుదినములు అక్కడనేయుండి 

12.రాత్రియందు నేనును నాతోకూడ నున్న కొందరును లేచితిమి. యెరూషలేమునుగూర్చి దేవుడు నా హృదయమందు పుట్టించిన ఆలోచనను నేనెవరితోనైనను చెప్పలేదు. మరియు నేను ఎక్కియున్న పశువుతప్ప మరి యే పశువును నాయొద్ద ఉండలేదు.౹ 

13.నేను రాత్రికాలమందు లోయద్వారముగుండ భుజంగపు బావియెదుటికిని పెంటద్వారము దగ్గరకును పోయి, పడద్రోయబడిన యెరూషలేముయొక్క ప్రాకారములను చూడగా దాని గుమ్మములు అగ్నిచేత కాల్చబడి యుండెను.౹ 

14.తరువాత నేను బుగ్గగుమ్మమునకు వచ్చి రాజు కోనేటికిని వెళ్లితిని గాని, నేను ఎక్కియున్న పశువు పోవుటకు ఎడము లేకపోయెను.౹ 

15.నేను రాత్రియందు మడుగు దగ్గరనుండి పోయి ప్రాకారమును చూచినమీదట వెనుకకు మరలి లోయ గుమ్మములో బడి తిరిగి వచ్చితిని.౹ 

16.అయితే నేను ఎచ్చటికి వెళ్లినది యేమి చేసినది అధికారులకు తెలియలేదు. యూదులకేగాని యాజకులకేగాని యజమానులకేగాని అధికారులకేగాని పనిచేయు ఇతరమైనవారికేగాని నేను ఆ సంగతి చెప్పి యుండలేదు.౹ 

17.అయితే వారితో నేనిట్లంటిని–మనకు కలిగినశ్రమ మీకు తెలిసియున్నది, యెరూషలేము ఎట్లు పాడైపోయెనో దాని గుమ్మములు అగ్నిచేత ఎట్లు కాల్చ బడెనో మీరు చూచియున్నారు, మనకు ఇకమీదట నింద రాకుండ యెరూషలేముయొక్క ప్రాకారమును మరల కట్టుదము రండి.౹ 

18.ఇదియుగాక నాకు సహాయముచేయు దేవుని కరుణాహస్తమునుగూర్చియు, రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నియు నేను వారితో చెప్పితిని. అందుకు వారు–మనము కట్టుటకు పూనుకొందము రండని చెప్పి యీ మంచికార్యము చేయుటకై బలము తెచ్చుకొనిరి.౹ 

19.అయితే హోరోనీయుడైన సన్బల్లటును, అమ్మోనీయుడైన దాసుడగు టోబీయా అనువాడును, అరబీయుడైన గెషెమును ఆ మాట వినినప్పుడు మమ్మును హేళన చేసి మా పని తృణీకరించి–మీరు చేయుపనియేమిటి? రాజుమీద తిరుగుబాటు చేయుదురా అని చెప్పిరి.౹ 

20.అందుకు నేను–ఆకాశమందు నివాసియైన దేవుడు తానే మా యత్నమును సఫలము చేయును గనుక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొనుచున్నాము, యెరూషలేమునందు మీకు భాగమైనను స్వతంత్రమైనను జ్ఞాపక సూచనయైనను లేదని ప్రత్యుత్తరమిచ్చితిని.

నెహెమ్యా 3

ప్రాకారమును నిర్మించువారు

3 ప్రధానయాజకుడైన ఎల్యాషీబును అతని సహోదరు లైన యాజకులును లేచి గొఱ్ఱెల గుమ్మమును కట్టి ప్రతిష్ఠించి తలుపులు నిలిపిరి. హమ్మేయా గోపురమువరకును హనన్యేలు గోపురమువరకును ప్రాకారమునుకట్టి ప్రతిష్ఠించిరి.౹ 

2.అతని ఆనుకొని యెరికో పట్టణపువారు కట్టిరి; వారిని ఆనుకొని ఇమ్రీ కుమారుడైన జక్కూరు కట్టెను;౹ 

3.మత్స్యపు గుమ్మమును హస్సెనాయా వంశస్థులుకట్టిరి; మరియు వారు దానికి దూలములను ఎత్తి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చిరి.౹ 

4.వారిని ఆనుకొని హక్కోజునకు పుట్టిన ఊరియా కుమారుడైన మెరేమోతును, వారిని ఆనుకొని మెషేజబెయేలునకు పుట్టిన బెరెక్యా కుమారుడైన మెషుల్లామును, వారిని ఆనుకొని బయనా కుమారుడైన సాదోకును,౹ 

5.వారిని ఆనుకొని తెకోవీయులును బాగుచేసిరి. అయితే జనుల అధికారులు తమ ప్రభువు పనిచేయ నొప్పుకొనక పోయిరి.౹ 

6.పాత గుమ్మమును బాగుచేయువారు ఎవరనగా పాసెయ కుమారుడైన యెహోయాదాయును బెసోద్యా కుమారుడైన మెషుల్లామును దానికి దూలములను ఎత్తి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చిరి.౹ 

7.వారిని ఆనుకొని గిబియో నీయులును మిస్పావారును గిబియోనీయుడైన మెలట్యాయును మేరోనోతీయుడైన యాదోనును ఏటి యివతలనున్న అధికారి న్యాయపీఠముంచబడు స్థలమువరకు బాగు చేసిరి.౹ 

8.వారిని ఆనుకొని బంగారపు పనివారి సంబంధి యైన హర్హయా కుమారుడైన ఉజ్జీయేలు బాగుచేయువాడై యుండెను. అతని ఆనుకొని ఔషధజ్ఞానియగు హనన్యా పని జరుపుచుండెను. యెరూషలేముయొక్క వెడల్పు గోడవరకు దాని నుండనిచ్చిరి.౹ 

9.వారిని ఆనుకొని యెరూషలేములో సగముభాగమునకు అధిపతియైన హూరు కుమారుడైన రెఫాయా బాగుచేసెను.౹ 

10.వారిని ఆనుకొని తన యింటికి ఎదురుగా హరూమపు కుమారుడైన యెదాయా బాగుచేసెను, అతని ఆనుకొని హషబ్నెయా కుమారుడైన హట్టూషు పని జరుపువాడై యుండెను.౹ 

11.రెండవభాగమును అగ్నిగుండముల గోపురమును హారిము కుమారుడైన మల్కీయాయును పహత్మోయాబు కుమారుడైన హష్షూ బును బాగుచేసిరి.౹ 

12.వారిని ఆనుకొని యెరూషలేములో సగమునకు అధిపతియైన హల్లోహషు కుమారుడైన షల్లూమును ఆతని కుమార్తెలును బాగుచేసిరి.౹ 

13.లోయద్వారమును హానూనును జానోహ కాపురస్థులును బాగుచేసి కట్టినతరువాత దానికి తలుపులను తాళములను గడియలను అమర్చిరి. ఇదియుగాక పెంటద్వారమువరకుండు గోడ వెయ్యిమూరలదనుక వారుకట్టిరి.౹ 

14.బేత్‌హక్కెరెము ప్రదేశమునకు అధిపతియైన రేకాబు కుమారుడైన మల్కీయా పెంటగుమ్మమును బాగు చేసెను, ఆతడు దాని కట్టిన తరువాత దానికి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చెను 

15.అటు వెనుక మిస్పా ప్రదేశమునకు అధిపతియైన కొల్హోజె కుమారుడైన షల్లూము ధారయొక్క గుమ్మమును బాగుచేసి కట్టిన తరువాత దానికి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చెను. ఇదియుగాక దావీదు పట్టణమునుండి క్రిందకు పోవు మెట్లవరకు రాజు తోటయొద్దనున్న సిలోయము మడుగుయొక్క గోడను అతడు కట్టెను.౹ 

16.అతని ఆనుకొని బేత్సూరులో సగము భాగమునకు అధిపతియు అజ్బూకు కుమారుడునైన నెహెమ్యా బాగుచేసెను. అతడు దావీదు సమాధులకు ఎదురుగానున్న స్థలములవరకును కట్టబడిన కోనేటివరకును పరాక్రమశాలులయిండ్ల స్థలమువరకును కట్టెను.౹ 

17.అతని ఆనుకొని లేవీయులలో బానీ కుమారుడైన రెహూము బాగుచేసెను; అతని ఆనుకొని తన భాగములో కెయిలాయొక్క సగముభాగమునకు అధిపతియైన హషబ్యా బాగుచేయువాడాయెను.౹ 

18.అతని ఆనుకొని వారి సహోదరులైన హేనాదాదు కుమారుడైన బవ్వై బాగుచేసెను. అతడు కెయీలాలో సగము భాగమునకు అధిపతిగా ఉండెను.౹ 

19.అతని ఆనుకొని మిస్పాకు అధిపతియు యేషూవకు కుమారుడునైన ఏజెరు ఆయుధముల కొట్టు మార్గమునకు ఎదురుగానున్న గోడ మలుపు ప్రక్కను మరియొక భాగమును బాగు చేసెను.౹ 

20.అతని ఆనుకొని ఆ గోడ మలుపునుండి ప్రధానయాజకుడైన ఎల్యాషీబు ఇంటిద్వారమువరకు ఉన్న మరియొక భాగమును జబ్బయి కుమారుడైన బారూకు ఆసక్తితో బాగు చేసెను.౹ 

21.అతని ఆనుకొని ఎల్యాషీబు ఇంటి ద్వారము నుండి ఆ యింటి కొనవరకు హక్కోజునకు పుట్టిన ఊరియా కుమారుడైన మెరేమోతు బాగుచేసెను.౹ 

22.అతనిని ఆనుకొని యొర్దాను మైదానములో నివాసులైన యాజకులు బాగుచేయువారైరి.౹ 

23.వారిని ఆనుకొని తమ యింటి కెదురుగా బెన్యామీను హష్షూబు అను వారు బాగుచేసిరి; వారిని ఆనుకొని తన యింటియొద్ద అనన్యాకు పుట్టిన మయశేయా కుమారుడైన అజర్యా బాగుచేసెను.౹ 

24.అతని ఆనుకొని అజర్యా యిల్లు మొదలుకొని గోడ మలుపు మూలవరకును హేనాదాదు కుమారుడైన బిన్నూయి మరియొక భాగమును బాగుచేసెను.౹ 

25.అతని ఆనుకొని గోడ మళ్లిన దిక్కున చెరసాల దగ్గర రాజు నగరులో నిలుచు మహా గోపురమువరకు ఊజై కుమారుడైన పాలాలు బాగుచేయువాడాయెను; అతని ఆనుకొని పరోషు కుమారుడైన పెదాయా బాగుచేసెను.౹ 

26.ఓపెలులోనున్న నెతీనీయులు తూర్పువైపు నీటి గుమ్మము ప్రక్కను దానికి సంబంధించిన గోపురము దగ్గరను బాగుచేసిరి.౹ 

27.వారిని ఆనుకొని ఓపెలు గోడవరకు గొప్ప గోపురమునకు ఎదురుగానున్న మరియొక భాగమును తెకోవీయులు బాగుచేసిరి.౹ 

28.గుఱ్ఱపు గుమ్మమునకు పైగా యాజకులందరు తమయిండ్ల కెదురుగా బాగుచేసిరి.౹ 

29.వారిని ఆనుకొని తన యింటికి ఎదురుగా ఇమ్మేరు కుమారుడైన సాదోకు బాగుచేసెను; అతని ఆనుకొని తూర్పు ద్వారమును కాయు షెకన్యా కుమారుడైన షెమయా బాగుచేసెను.౹ 

30.అతని ఆనుకొని షెలెమ్యా కుమారుడైన హనన్యాయును జాలాపు ఆరవ కుమారుడైన హానూనును మరియొక భాగమును బాగుచేయు వారైరి; వారిని ఆనుకొని తన గదికి ఎదురుగా బెరెక్యా కుమారుడైన మెషుల్లాము బాగుచేసెను.౹ 

31.అతని ఆనుకొని నెతీ నీయుల స్థలమునకును మిప్కాదు ద్వారమునకు ఎదురుగా నున్న వర్తకుల స్థలముయొక్క మూలవరకును బంగారపు పనివాని కుమారుడైన మల్కీయా బాగుచేసెను.౹ 

32.మరియు మూలకును గొఱ్ఱెల గుమ్మమునకునుమధ్యను బంగారపు పనివారును వర్తకులును బాగుచేసిరి.

నెహెమ్యా 4

పునర్నిర్మాణానికి వ్యతిరేకత

4 మేము గోడ కట్టుచున్న సమాచారము విని సన్బల్లటు మిగుల కోపగించి రౌద్రుడై యూదులను ఎగతాళిచేసి 

2.షోమ్రోను దండువారి యెదుటను తన స్నేహితుల యెదుటను ఇట్లనెను–దుర్బలులైన యీ యూదులు ఏమి చేయుదురు? తమంతట తామే యీ పని ముగింతురా? బలులు అర్పించి బలపరచుకొందురా? ఒక దినమందే ముగింతురా? కాల్చబడిన చెత్తను కుప్పలుగాపడిన రాళ్లను మరల బలమైనవిగా చేయుదురా? 

3.మరియు అమ్మోనీయుడైన టోబీయా అతనియొద్దను ఉండి–వారు కట్టినదానిపైకి ఒక నక్క యెగిరినట్టయిన వారి రాతిగోడ పడిపోవుననెను.౹ 

4.–మా దేవా ఆలకించుము, మేము తిరస్కారము నొందిన వారము; వారి నింద వారి తలలమీదికి వచ్చునట్లుచేసి, వారు చెరపట్టబడినవారై వారు నివసించు దేశములోనే వారిని దోపునకు అప్పగించుము.౹ 

5.వారు కట్టువారినిబట్టి నీకు కోపము పుట్టించి యుండిరి గనుక వారి దోషమును పరిహరింపకుము, నీయెదుట వారి పాపమును తుడిచి వేయకుము.౹ 

6.అయినను పని చేయుటకు జనులకు మనస్సు కలిగియుండెను గనుక మేము గోడను కట్టుచుంటిమి, అది సగము ఎత్తు కట్టబడి యుండెను.

7.సన్బల్లటును టోబీయాయును అరబీయులును అమ్మోనీయులును అష్డోదీయులును, యెరూషలేముయొక్క గోడలు కట్టబడెననియు, బీటలన్నియు కప్పబడెననియు వినినప్పుడు 

8.మిగుల కోపపడి యెరూషలేము మీదికి యుద్ధమునకు వచ్చి, పని ఆటంకపరచవలెనని వారందరు కట్టుకట్టి మమ్మును కలతపరచగా,౹ 

9.మేము మా దేవునికి ప్రార్థనచేసి, వారి భయముచేత రాత్రింబగళ్లు కావలియుంచితిమి.౹ 

10.అప్పుడు యూదావారు – బరువులు మోయువారి బలము తగ్గిపోయెను, ఉన్న చెత్త విస్తారము, గోడ కట్టలేమని చెప్పగా,౹ 

11.మా విరోధులును – వారు తెలిసికొనకుండను చూడకుండను మనము వారిమధ్యకు చొరబడి వారిని చంపి పని ఆటంకపరచుదమనిరి.౹ 

12.మా శత్రువులయొద్ద నివాసులైయున్న యూదులు వచ్చి–నలు దిక్కులనుండి మీరు మా సహాయమునకు రావలెనని మాటి మాటికి మాతో చెప్పగా 

13.అందునిమిత్తము గోడవెనుక నున్న దిగువ స్థలములలోను పైనున్న స్థలములలోను జనులను వారి వారి కుటుంబముల ప్రకారముగా వారి కత్తులతోను వారి యీటెలతోను వారి విండ్లతోను నిలిపితిని.౹ 

14.అంతట నేను లేచి చూచి ప్రధానులతోను అధికారులతోను జనులతోను–వారికి మీరు భయపడకుడి, మహా ఘనుడును భయంకరుడునగు యెహోవాను జ్ఞాపకము చేసికొని, మీ సహోదరుల పక్షముగాను మీ కుమారుల పక్షముగాను మీ కుమార్తెల పక్షముగాను మీ భార్యల పక్షముగాను మీ నివాసము మీకుండునట్లు యుద్ధము చేయుడి అంటిని.

15.వారి యోచన మాకు తెలియబడెననియు, దేవుడు దానిని వ్యర్థము చేసెననియు మా శత్రువులు సమాచారము వినగా, మాలో ప్రతివాడును తన పనికి గోడదగ్గరకు వచ్చెను.౹ 

16.అయితే అప్పటినుండి నా పనివారిలో సగము మంది పనిచేయుచు వచ్చిరి, సగముమంది యీటెలును బల్లెములును విండ్లును కవచములును ధరించినవారై వచ్చిరి; అధికారులు యూదులలో ఆయా యింటివారి వెనుక నిలిచిరి.౹ 

17.గోడ కట్టువారును బరువులు మోయువారును బరువులు ఎత్తువారును, ఒక్కొక్కరు ఒక చేతితో పని చేసి ఒక చేతితో ఆయుధము పట్టుకొని యుండిరి.౹ 

18.మరియు కట్టువారిలో ఒక్కొకడు తన కత్తిని నడుమునకు బిగించుకొని గోడ కట్టుచు వచ్చెను, బాకా ఊదువాడు నాయొద్ద నిలిచెను.౹ 

19.అప్పుడు నేను ప్రధానులతోను అధికారులతోను మిగిలినవారితోను ఇట్లంటిని–పని మిక్కిలి గొప్పది, మనము గోడమీద ఒకరొకరికి చాల యెడముగా ఉన్నాము 

20.గనుక ఏ స్థలములో మీకు బాకానాదము వినబడునో అక్కడికి మా దగ్గరకు రండి, మన దేవుడు మన పక్షముగా యుద్ధముచేయును.౹ 

21.ఆప్రకారము మేము పనియందు ప్రయాసపడితిమి; సగముమంది ఉదయము మొదలుకొని నక్షత్రములు అగుపడువరకు ఈటెలు పట్టుకొనిరి.౹ 

22.మరియు ఆ కాలమందు నేను జనులతో– ప్రతివాడు తన పనివానితోకూడ యెరూషలేములో బస చేయవలెను, అప్పుడు వారు రాత్రి మాకు కాపుగా నుందురు, పగలు పనిచేయుదురని చెప్పితిని.౹ 

23.ఈలాగున నేనుగాని నా బంధువులుగాని నా పనివారుగాని నా వెంబడియున్న పారావారుగాని ఉదుకుకొనుటకు తప్ప మరి దేనికిని మా వస్త్రములను తీసివేయలేదు.

నెహెమ్యా 5

నెహెమ్యా పేదలకు సహాయం చేయుట

5 తమ సహోదరులైన యూదులమీద జనులును వారి భార్యలును కఠినమైన ఫిర్యాదుచేసిరి.౹

2.ఏదనగా కొందరు –మేమును మా కుమారులును మా కుమార్తెలును అనేకు లము. అందుచేత మేముతిని బ్రదుకుటకు ధాన్యము మీయొద్ద తీసికొందుమనిరి.౹ 

3.మరికొందరు–క్షామ మున్నందున మా భూములను ద్రాక్షతోటలను మాయిండ్లను కుదువ పెట్టితిమి గనుక మీయొద్ద ధాన్యము తీసికొందు మనిరి.౹ 

4.మరికొందరు–రాజుగారికి పన్ను చెల్లించుటకై మా భూములమీదను మా ద్రాక్షతోటలమీదను మేము అప్పు చేసితిమి.౹ 

5.మా ప్రాణము మా సహోదరుల ప్రాణమువంటిది కాదా? మా పిల్లలు వారి పిల్లలను పోలినవారు కారా? మా కుమారులను మా కుమార్తెలను దాసులగుటకై అప్పగింపవలసి వచ్చెను; ఇప్పటికిని మా కుమార్తెలలో కొందరు దాసత్వములోనున్నారు, మా భూములును మా ద్రాక్షతోటలును అన్యులవశమున నుండగా వారిని విడిపించుటకు మాకు శక్తి చాలకున్నదని చెప్పగా 

6.వారి ఫిర్యాదును ఈ మాటలను నేను వినినప్పుడు మిగుల కోపపడితిని.౹ 

7.అంతట నాలో నేనే యోచనచేసి ప్రధానులను అధికారులను గద్దించి–మీరు మీ సహోదరులయొద్ద వడ్డి పుచ్చుకొనుచున్నారని చెప్పి వారిని ఆటంకపరచుటకై మహా సమాజమును సమకూర్చి 

8.–అన్యులకు అమ్మబడిన మా సహోదరులైన యూదులను మా శక్తికొలది మేము విడిపించితిమి, మీరు మీ సహోదరులను అమ్ముదురా? వారు మనకు అమ్మబడవచ్చునా? అని వారితో చెప్పగా, వారు ఏమియు చెప్పలేక ఊరకుండిరి.౹ 

9.మరియు నేను–మీరు చేయునది మంచిది కాదు, మన శత్రువులైన అన్యుల నిందనుబట్టి మన దేవునికి భయపడి మీరు ప్రవర్తింప కూడదా? 

10.నేనును నా బంధువులును నా దాసులును కూడ ఆలాగుననే వారికి సొమ్మును ధాన్యమును అప్పుగా ఇచ్చితిమి; ఆ అప్పు పుచ్చుకొనకుందము.౹ 

11.ఈ దినములోనే వారియొద్ద మీరు అపహరించిన భూములను ద్రాక్షతోటలను ఒలీవతోటలను వారి యిండ్లను వారికి అప్పుగా ఇచ్చిన సొమ్ములోను ధాన్యములోను ద్రాక్షారసములోను నూనెలోను నూరవభాగమును వారికి మరల అప్పగించుడని నేను మిమ్మును బతిమాలుచున్నాను అంటిని.౹ 

12.అందుకు వారు–నీవు చెప్పినప్రకారమే యివన్నియు ఇచ్చివేసి వారియొద్ద ఏమియు కోరమనిరి. అంతట నేను యాజకులను పిలిచి ఈ వాగ్దాన ప్రకారము జరిగించుటకు వారిచేత ప్రమాణము చేయించితిని.౹ 

13.మరియు నేను నా ఒడిని దులిపి–ఈ ప్రకారమే దేవుడు ఈ వాగ్దానము నెరవేర్చని ప్రతివానిని తన యింటిలో ఉండకయు తన పని ముగింపకయు నుండునట్లు దులిపివేయును; ఇటువలె వాడు దులిపి వేయబడి యేమియు లేనివాడుగా చేయబడునుగాకని చెప్పగా, సమాజకులందరు ఆలాగు కలుగునుగాక అని చెప్పి యెహోవాను స్తుతించిరి. జనులందరును ఈ మాటచొప్పుననే జరిగించిరి.౹ 

14.మరియు నేను యూదాదేశములో వారికి అధికారిగా నిర్ణయింపబడినకాలము మొదలుకొని, అనగా అర్తహషస్త రాజు ఏలుబడియందు ఇరువదియవ సంవత్సరము మొదలుకొని ముప్పదిరెండవ సంవత్సరమువరకు పండ్రెండు సంవత్సరములు అధికారికి రావలసిన సొమ్మును నేనుగాని నా బంధువులుగాని తీసికొనలేదు.౹ 

15.అయితే నాకు ముందుగానుండిన అధికారులు జనులయొద్ద నుండి ఆహారమును ద్రాక్షారసమును నలువది తులముల వెండిని తీసికొనుచు వచ్చిరి; వారి పనివారు సహా జనులమీద భారము మోపుచు వచ్చిరి, అయితే దేవుని భయముచేత నేనాలాగున చేయలేదు.౹ 

16.ఇదియుగాక నేను ఈ గోడపనిచేయగా నా పనివారును ఆ పనిచేయుచు వచ్చిరి.౹ 

17.భూమి సంపాదించుకొనినవారము కాము; నా భోజనపు బల్లయొద్ద మా చుట్టునున్న అన్యజనులలోనుండి వచ్చినవారు గాక యూదులును అధికారులును నూట ఏబదిమంది కూర్చునియుండిరి.౹ 

18.నా నిమిత్తము ప్రతిదినము ఒక యెద్దును శ్రేష్ఠమైన ఆరు గొఱ్ఱెలును సిద్ధము చేయబడెను. ఇవియుగాక కోళ్లను, పదిరోజులకు ఒకమారు నానావిధమైన ద్రాక్షారసములను సిద్ధము చేసితిని. ఈ ప్రకారముగా చేసినను ఈ జనుల దాసత్వము బహు కఠినముగా ఉండినందున అధికారికి రావలసిన సొమ్మును నేను అపేక్షింపలేదు.౹ 

19.నా దేవా, ఈ జనులకు నేను చేసిన సకలమైన ఉపకారములనుబట్టి నాకు మేలు కలుగునట్లుగా నన్ను దృష్టించుము.

నెహెమ్యా 6

పునర్నిర్మాణానికి మరింత వ్యతిరేకత

6 నేను ఇంకను గుమ్మములకు తలుపులు నిలుపకముందుగా దానిలో బీటలులేకుండ సంపూర్ణముగా గోడను కట్టియుండగా, సన్బల్లటును టోబీయాయును అరబీయుడైన గెషెమును మా శత్రువులలో మిగిలినవారును విని 

2.సన్బల్లటును గెషెమును నాకు ఏదో హాని చేయుటకు ఆలోచించి–ఓనో మైదానమందున్న గ్రామములలో ఒక దాని దగ్గర మనము కలిసికొందము రండని నాయొద్దకు వర్తమానము పంపిరి.౹ 

3.అందుకు నేను–నేను చేయుపని గొప్పది, దానివిడిచి మీయొద్దకు వచ్చుటకై నేను దాని నెందుకు ఆపవలెను? నేను రాలేనని చెప్పుటకు దూతలను పంపితిని.౹ 

4.వారు ఆలాగున నాలుగు మారులు నాయొద్దకు వర్తమానము పంపగా ఆప్రకారమే నేను మరల ప్రత్యుత్తరమిచ్చితిని.౹ 

5.అంతట అయిదవమారు సన్బల్లటు తన పనివాని ద్వారా విప్పియున్న యొక పత్రికను నాయొద్దకు పంపెను.౹ 

6.అందులో–వారిపైన రాజుగా ఉండవలెనని నీవు ప్రాకారమును కట్టుచున్నావనియు, ఈ హేతువు చేతనే నీవును యూదులును రాజుమీద తిరుగుబాటు చేయునట్లుగా నీవు ఆలోచించుచున్నావనియు,౹ 

7.యూదులకు రాజుగా ఉన్నాడని నిన్నుగూర్చి ప్రకటనచేయుటకు యెరూషలేములో ప్రవక్తలను నీవు నియమించితివనియు మొదలగు మాటలును–రాజునకు ఈ సంగతులు తెలియనగుననియు మొదలగు మాటలును, –అందునిమిత్తము ఇప్పుడు మనము యోచన చేసెదము రండనియు, ఈ సంగతి అన్యజనుల వదంతియనియు, దానిని గెషెము చెప్పుచున్నాడనియు వ్రాయబడెను.౹ 

8.ఈ పని చేయలేకుండ మేమశక్తులమగుదుమనుకొని వారందరు మమ్మును బెదరింప జూచిరిగాని 

9.నేను–ఇటువంటి కార్యములను మేమెంత మాత్రమును చేయువారముకాము, వీటిని నీ మనస్సులోనుండి నీవు కల్పించుకొంటివని అతనియొద్దకు నేను వర్తమానము పంపితిని. దేవా, ఇప్పుడు నా చేతులను బలపరచుము.

10.అటుతరువాత మెహేతబేలునకు పుట్టిన దెలాయ్యా కుమారుడైన షెమయాయొక్క యింటికి వచ్చితిని. అతడు బయటికి రాకుండ నిర్బంధింపబడెను. అతడు–రాత్రి కాలమందు నిన్ను చంపుటకు వారు వచ్చెదరు గనుక, దేవుని మందిర గర్భాలయములోపలికి మనము పోయి తలుపులు వేసికొనెదము రండని చెప్పగా 

11.నేను–నావంటివాడు పారిపోవచ్చునా? ఇంతవాడనైన నేను నా ప్రాణమును రక్షించుకొనుటకైనను గర్భాలయమున ప్రవేశింప వచ్చునా? నేను అందులో ప్రవేశింపనంటిని.౹ 

12.అప్పుడు దేవుడు అతని పంపలేదనియు, టోబీయాయును సన్బల్లటును అతనికి లంచమిచ్చినందున నా విషయమై యీ ప్రకటన చేసెననియు తేటగ కనుగొంటిని 

13.ఇందువలన నాకు భయము పుట్టగా, నేను అతడు చెప్పినట్లు చేసి పాపములో పడుదునని అనుకొని, నామీద నింద మోపునట్లుగా నన్నుగూర్చి చెడువార్త పుట్టించుటకు వారతనికి లంచమిచ్చి యుండిరి.౹ 

14.నా దేవా, వారి క్రియలనుబట్టి టోబీయాను సన్బల్లటును నన్ను భయపెట్టవలెనని కనిపెట్టి యున్న ప్రవక్తలను, నోవద్యా అను ప్రవక్తిని జ్ఞాపకము చేసికొనుము.

15.ఈ ప్రకారముగా ఏలూలు మాసము ఇరువదియయిదవ దినమందు, అనగా ఏబదిరెండు దినములకు ప్రాకారమును కట్టుట సమాప్తమాయెను.౹ 

పూర్తయిన ప్రకారమునకు వ్యతిరేకత

16.అయితే మా శత్రువులు ఈ సంగతి వినినప్పుడును, మా చుట్టునుండు అన్యజనులందరు జరిగినపని చూచినప్పుడును, వారు బహుగా అధైర్య పడిరి; ఏలయనగా ఈ పని మా దేవునివలన జరిగినదని వారు తెలిసికొనిరి.౹ 

17.ఆ దినములలో యూదుల ప్రధానులు టోబీయా యొద్దకు మాటి మాటికి పత్రికలు పంపుచు వచ్చిరి; అతడును వారికి పత్రికలు పంపుచుండెను.౹ 

18.అతడు ఆరహు కుమారుడైన షెకన్యాకు అల్లుడు. ఇదియుగాక యోహానాను అను తన కుమారుడు బెరెక్యా కుమారుడైన మెషుల్లాము కుమార్తెను వివాహము చేసికొనియుండెను గనుక యూదులలో అనేకులు అతని పక్షమున నుండెదమని ప్రమాణము చేసిరి.౹ 

19.వారు నా యెదుట అతని గుణాతిశయములనుగూర్చి మాటలాడుచువచ్చిరి, నేను చెప్పిన మాటలు అతనికి తెలియజేసిరి. నన్ను భయపెట్టు టకే టోబీయా పత్రికలు పంపెను.

నెహెమ్యా 7

7 నేను ప్రాకారమును కట్టి తలుపులు నిలిపి, ద్వారపాలకులను గాయకులను లేవీయులను నియమించిన పిమ్మట 

2.నా సహోదరుడైన హనానీకిని, కోటకు అధిపతియైన హనన్యాకును యెరూషలేముపైన అధికారము ఇచ్చితిని. హనన్యా నమ్మకమైన మనుష్యుడు, అందరికంటె ఎక్కువగా దేవునియెదుట భయభక్తులుగలవాడు.౹ 

3.అప్పుడు నేను–బాగుగా ప్రొద్దెక్కువరకు యెరూషలేముయొక్క గుమ్మముల తలుపులు తియ్యకూడదు; మరియు జనులు దగ్గర నిలువబడియుండగా తలుపులు వేసి అడ్డగడియలు వాటికి వేయవలెననియు, ఇదియుగాక యెరూషలేము కాపురస్థులందరు తమతమ కావలి వంతులనుబట్టి తమ యిండ్లకు ఎదురుగా కాచుకొనుటకు కావలి నియమింపవలెననియు చెప్పితిని.౹

తిరిగి వచ్చిన ప్రవాసుల జాబితా

4.అప్పటిలో ఆ పట్టణము మిగుల విశాలముగాను పెద్దదిగాను ఉండెనుగాని దానిలో జనులు కొద్దిగా ఉండిరి, యిండ్లు ఇంక కట్టబడలేదు.౹ 

5.జనసంఖ్యచేయునట్లు నా దేవుడు నా హృదయములో తలంపు పుట్టింపగా, ప్రధానులను అధికారులను జనులను నేను సమకూర్చితిని. అంతలో ముందు వచ్చినవారినిగూర్చిన వంశావళి గ్రంథము నాకు కనబడెను, అందులో వ్రాయబడిన వంశావళులు ఇవి.౹ 

6.జెరుబ్బాబెలు యేషూవ నెహెమ్యా అజర్యా రయమ్యా నహమానీ మొర్దకై బిల్షాను మిస్పెరేతు బిగ్వయి నెహూము బయనా అనువారితోకూడ బాబెలురాజైన నెబుకద్నెజరుచేత చెరలోనికి కొనిపోబడి 

7.తిరిగి యెరూషలేమునకును యూదాదేశమునకును తమతమ పట్టణములకు వచ్చినవారు వీరే. ఇశ్రాయేలీయులయొక్క జనసంఖ్య యిదే.౹

 64.వీరి వంశా వళులనుబట్టి యెంచబడినవారిలో వారి పద్దు పుస్తకమును వెదకగా అది కనబడకపోయెను; కాగా వారు అపవిత్రులుగా ఎంచబడి యాజకులలో ఉండకుండ వేరుపరచబడిరి.౹ 

65.కాగా అధికారి–ఊరీము తుమ్మీము అనువాటిని ధరించుకొని ఒక యాజకుడు ఏర్పడువరకు అతిపరిశుద్ధవస్తువులను మీరు తినకూడదని వారితో చెప్పెను.౹ 

66.సమాజకులందరును నలువది రెండువేల మూడువందల అరువదిమంది.౹ 

67.వీరు గాక వీరి పనివారును పనికత్తెలును ఏడువేల మూడు వందల ముప్పదియేడుగురును, గాయకులలో స్త్రీ పురు షులు రెండువందల నలువది యయిదుగురునై ఉండిరి.౹ 

68.వారి గుఱ్ఱములు ఏడువందల ముప్పది ఆరును, వారి కంచరగాడిదలు రెండువందల నలువది యయిదును 

69.వారి ఒంటెలు నాలుగువందల ముప్పది యయిదును వారి గాడిదలు ఆరువేల ఏడువందల ఇరువదియునై యుండెను.

70.పెద్దలలో ప్రధానులైన కొందరు పనికి కొంత సహాయము చేసిరి. అధికారి ఖజానాలో నూట ఇరువది తులముల బంగారమును ఏబది పళ్లెములను ఏడువందల ముప్పది యాజక వస్త్రములను వేసి యిచ్చెను.౹ 

71.మరియు పెద్దలలో ప్రధానులైనవారు కొందరు ఖజానాలో నూట నలువది తులముల బంగారమును పదునాలుగు లక్షల తులముల వెండిని వేసిరి.౹ 

72.మిగిలినవారును రెండువందల నలువది తులముల బంగారమును రెండువందల నలువది లక్షల తులముల వెండిని అరువదియేడు యాజక వస్త్రములను ఇచ్చిరి.౹ 

73.అప్పుడు యాజకులు లేవీయులు ద్వారపాలకులు గాయకులు జనులలో కొందరును, నెతీనీయులు ఇశ్రాయేలీయులందరును, తమ పట్టణములయందు నివాసము చేసిరి.

నెహెమ్యా 8

ఎజ్రా ధర్మశాస్త్రగ్రంథమును చదివి వినిపించుట

8 ఏడవ నెల రాగా ఇశ్రాయేలీయులు తమ పట్టణములలో నివాసులై యుండిరి. అప్పుడు జనులందరును ఏక మనస్కులై, నీటి గుమ్మము ఎదుటనున్న మైదానమునకు వచ్చి –యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్రగ్రంథమును తెమ్మని ఎజ్రా అను శాస్త్రితో చెప్పగా 

2.యాజకుడైన ఎజ్రా యేడవ మాసము మొదటి దినమున చదువబడుదాని గ్రహింపశక్తిగల స్త్రీ పురుషులు కలిసిన సమాజమంతటి యెదుటను ఆ ధర్మశాస్త్రగ్రంథము తీసికొనివచ్చి 

3.నీటి గుమ్మము ఎదుటనున్న మైదానములో ఉదయము మొదలుకొని మధ్యాహ్నమువరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకును, తెలివితో వినగలవారికందరికిని చదివి వినిపించుచు వచ్చెను, ఆ జనులందరును ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిరి 

4.అంతట శాస్త్రియగు ఎజ్రా ఆ పనికొరకు కఱ్ఱతో చేయబడిన యొక పీఠము మీద నిలువబడెను; మరియు అతని దగ్గర కుడిపార్శ్వమందు మత్తిత్యా షెమ అనాయా ఊరియా హిల్కీయా మయశేయా అనువారును, అతని యెడమ పార్శ్వమందు పెదాయా మిషాయేలు మల్కీయా హాషుము హష్బద్దానా జెకర్యా మెషుల్లాము అనువారును నిలిచియుండిరి.౹ 

5.అప్పుడు ఎజ్రా అందరికంటె ఎత్తుగా నిలువబడి జనులందరును చూచుచుండగా గ్రంథమును విప్పెను, విప్ప గానే జనులందరు నిలువబడిరి.౹ 

6.ఎజ్రా మహా దేవుడైన యెహోవాను స్తుతింపగా జనులందరు తమ చేతులెత్తి– ఆమేన్ ఆమేన్ అని పలుకుచు, నేలకు ముఖములు వంచుకొని యెహోవాకు నమస్కరించిరి.౹ 

7.జనులు ఈలాగు నిలువబడుచుండగా యేషూవ బానీ షేరేబ్యా యామీను అక్కూబు షబ్బెతై హోదీయా మయశేయా కెలీటా అజర్యా యోజాబాదు హానాను పెలాయాలును లేవీయులును ధర్మశాస్త్రముయొక్క తాత్పర్యమును తెలియ జెప్పిరి.౹ 

8.ఇటువలెనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించునట్లు దానికి అర్థము చెప్పిరి.౹ 

9.జనులందరు ధర్మశాస్త్రగ్రంథపు మాటలు విని యేడ్వ మొదలుపెట్టగా, అధికారియైన నెహెమ్యాయు యాజకుడును శాస్త్రియునగు ఎజ్రాయును జనులకు బోధించు లేవీయులును–మీరు దుఃఖపడవద్దు, ఏడ్వవద్దు, ఈ దినము మీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత దినమని జనులతో చెప్పిరి.౹ 

10.మరియు అతడు వారితో నిట్లనెను–పదండి, క్రొవ్విన మాంసము భక్షించుడి, మధురమైనదాని పానము చేయుడి, ఇదివరకు తమకొరకు ఏమియు సిద్ధము చేసికొనని వారికి వంతులు పంపించుడి. ఏలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయెను, మీరు దుఃఖపడకుడి,యెహోవాయందు ఆనందించుటవలన మీరు బల మొందుదురు.౹ 

11.ఆలాగున లేవీయులు జనులందరిని ఓదార్చి –మీరు దుఃఖము మానుడి, ఇది పరిశుద్ధదినము, మీరు దుఃఖపడకూడదని వారితో అనిరి.౹ 

12.ఆ తరువాత జనులు తమకు తెలియజేయబడిన మాటలన్నిటిని గ్రహించి, తినుటకును త్రాగుటకును లేనివారికి ఫలాహారములు పంపించుటకును సంభ్రమముగా ఉండుటకును ఎవరి యిండ్లకు వారు వెళ్లిరి.

13.రెండవదినమందు జనులందరి పెద్దలలో ప్రధానులైనవారును యాజకులును లేవీయులును ధర్మశాస్త్రగ్రంథపు మాటలు వినవలెనని శాస్త్రియైన ఎజ్రా యొద్దకు కూడి వచ్చిరి.౹ 

14.యెహోవా మోషేకు దయచేసిన గ్రంథములో చూడగా, ఏడవ మాసపు ఉత్సవకాలమందు ఇశ్రాయేలీయులు పర్ణశాలలో నివాసము చేయవలెనని వ్రాయబడి యుండుట కనుగొనెను 

15.మరియు వారు తమ పట్టణములన్నిటిలోను యెరూషలేములోను ప్రకటనచేసి తెలియ జేయవలసినదేమనగా–మీరు పర్వతమునకు పోయి ఒలీవ చెట్ల కొమ్మలను అడవి ఒలీవచెట్ల కొమ్మలను గొంజిచెట్ల కొమ్మలను ఈతచెట్ల కొమ్మలను గుబురుగల వేరువేరు చెట్ల కొమ్మలను తెచ్చి, వ్రాయబడినట్లుగా పర్ణశాలలు కట్టవలెను.౹ 

16.ఆప్రకారమే జనులుపోయి కొమ్మలను తెచ్చి జనులందరు తమతమ యిండ్లమీదను తమ లోగిళ్లలోను దేవమందిరపు ఆవరణములోను నీటి గుమ్మపు వీధిలోను ఎఫ్రాయిము గుమ్మపు వీధిలోను పర్ణశాలలు కట్టుకొనిరి.౹ 

17.మరియు చెరలోనుండి తిరిగి వచ్చినవారి సమూహమును పర్ణశాలలు కట్టుకొని వాటిలో కూర్చుండిరి. నూను కుమారుడైన యెహోషువ దినములు మొదలుకొని అదివరకు ఇశ్రాయేలీయులు ఆలాగున చేసియుండలేదు; అప్పుడు వారికి బహు సంతోషము పుట్టెను.౹ 

18.ఇదియుగాక మొదటి దినము మొదలుకొని కడదినమువరకు అను దినము ఎజ్రా దేవుని ధర్మశాస్త్ర గ్రంథమును చదివి విని పించుచు వచ్చెను. వారు ఈ ఉత్సవమును ఏడు దినములవరకు ఆచరించిన తరువాత విధిచొప్పున ఎనిమిదవదినమునవారు పరిశుద్ధ సంఘముగా కూడుకొనిరి.

నెహెమ్యా 9

ఇశ్రాయేలీయులు తమ పాపములను ఒప్పుకొనిరి

9 ఈ నెల యిరువది నాలుగవ దినమందు ఇశ్రాయేలీయులు ఉపవాసముండి గోనెపట్టలు కట్టుకొని తలమీద ధూళి పోసికొని కూడి వచ్చిరి.౹ 

2.ఇశ్రాయేలీయులు అన్యజనులందరిలోనుండి ప్రత్యేకింపబడిన వారై నిలువబడి, తమ పాపములను తమపితరుల పాపములను ఒప్పుకొనిరి.౹ 

3.మరియు వారు ఒక జాముసేపు తామున్న చోటనే నిలువ బడి, తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్రగ్రంథమును చదువుచు వచ్చిరి, ఒక జాముసేపు తమ పాపములను ఒప్పు కొనుచు దేవుడైన యెహోవాకు నమస్కారము చేయుచు వచ్చిరి.౹ 

4.లేవీయులలో యేషూవ బానీ కద్మీయేలు షెబన్యా బున్నీ షేరేబ్యా బానీ కెనానీ అనువారు మెట్లమీద నిలువబడి, యెలుగెత్తి, తమ దేవుడైన యెహోవాకు మొఱ్ఱపెట్టిరి.౹ 

5.అప్పుడు లేవీయులైన యేషూవ కద్మీయేలు బానీ హషబ్నెయా షేరేబ్యా హోదీయా షెబన్యా పెతహయా అనువారు–నిలువబడి, నిరంతరము మీకు దేవుడైయున్న యెహోవాను స్తుతించుడని చెప్పి ఈలాగు స్తోత్రము చేసిరి–సకలాశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్తుతింపబడునుగాక.౹ 

6.నీవే, అద్వితీయుడవైన యెహోవా, నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును, భూమిని దానిలో ఉండునది అంతటిని, సముద్రములను వాటిలో ఉండునది అంతటిని సృజించి వాటినన్నిటిని కాపాడువాడవు. ఆకాశసైన్యమంతయు నీకే నమస్కారము చేయుచున్నది.౹ 

7.దేవా యెహోవా, అబ్రామును ఏర్పరచుకొని, కల్దీయుల ఊరు అను స్థలము నుండి ఇవతలకు అతని రప్పించి అతనికి అబ్రాహామను పేరు పెట్టినవాడవు నీవే.౹ 

8.అతడు నమ్మకమైన మనస్సుగల వాడని యెరిగి, కనానీయులు హిత్తీయులు అమోరీయులు పెరిజ్జీయులు యెబూసీయులు గిర్గాషీయులు అనువారి దేశమును అతని సంతతివారికిచ్చునట్లు అతనితో నిబంధన చేసినవాడవు నీవే.౹ 

9.నీవు నీతిమంతుడవై యుండి నీ మాటచొప్పున జరిగించితివి. ఐగుప్తులో మా పితరులు పొందినశ్రమను నీవు చూచితివి, ఎఱ్ఱసముద్రమునొద్ద వారి మొఱ్ఱను నీవు వింటివి.౹ 

10.ఫరోయు అతని దాసులందరును అతని దేశపు జనులందరును వారియెడల బహు గర్వముగా ప్రవర్తించిరని నీకు తెలియగా నీవు వారియెదుట సూచకక్రియలను మహత్కార్యములను చూపించితివి. ఆలాగున చేయుటవలన నీవు ఈ దినమందున్నట్టుగా ప్రసిద్ధినొందితివి.౹ 

11.మరియు నీ జనులయెదుట నీవు సముద్రమును విభాగించినందునవారు సముద్రము మధ్య పొడినేలను నడచిరి, ఒకడు లోతునీట రాయి వేసినట్లు వారిని తరిమినవారిని అగాధజలములలో నీవు పడవేసితివి.౹ 

12.ఇదియుగాక పగటికాలమందు మేఘస్తంభములో ఉండిన వాడవును రాత్రికాలమందువారు వెళ్లవలసిన మార్గమున వెలుగిచ్చుటకై అగ్నిస్తంభములో ఉండినవాడవును అయి యుండి వారిని తోడుకొనిపోతివి.౹ 

13.సీనాయి పర్వతము మీదికి దిగి వచ్చి ఆకాశమునుండి వారితో మాటలాడి, వారికి నీతియుక్తమైన విధులను సత్యమైన ఆజ్ఞలను మేలు కరములైన కట్టడలను ధర్మములను నీవు దయచేసితివి.౹ 

14.వారికి నీ పరిశుద్ధమైన విశ్రాంతిదినమును ఆచరింప నాజ్ఞ ఇచ్చి నీ దాసుడైన మోషేద్వారా ఆజ్ఞలను కట్టడలను ధర్మశాస్త్రమును వారికి నియమించితివి.౹ 

15.వారి ఆకలి తీర్చుటకు ఆకాశమునుండి ఆహారమును వారి దాహము తీర్చుటకు బండలోనుండి ఉదకమును తెప్పించితివి. వారికి ప్రమాణముచేసిన దేశమును స్వాధీనపరచుకొనవలెనని వారికాజ్ఞాపించితివి.౹ 

16.అయితే వారును మా పితరులును గర్వించి, లోబడనొల్లక నీ ఆజ్ఞలకు చెవియొగ్గక పోయిరి.౹ 

17.వారు విధేయులగుటకు మనస్సు లేనివారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసికొనక తమ మనస్సును కఠినపరచుకొని, తాముండి వచ్చిన దాస్యపుదేశమునకు తిరిగి వెళ్లుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగు బాటు చేసిరి. అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవును, దయావాత్సల్యతలు గలవాడవును, దీర్ఘశాంతమును బహు కృపయు గలవాడవునైయుండి వారిని విసర్జింపలేదు.౹ 

18.వారు ఒక పోతదూడను చేసికొని–ఐగుప్తులోనుండి మమ్మును రప్పించిన దేవుడు ఇదే అని చెప్పి, నీకు బహు విసుకు పుట్టించినను 

19.వారు ఎడారిలో ఉండగా నీవు బహువిస్తారమైన కృప కలిగినవాడవై వారిని విసర్జింపలేదు; మార్గముగుండ వారిని తోడుకొని పోవుటకు పగలు మేఘస్తంభమును, దారిలో వారికి వెలు గిచ్చుటకు రాత్రి అగ్నిస్తంభమును వారిపైనుండి వెళ్లిపోక నిలిచెను.౹ 

20.వారికి బోధించుటకు నీ యుపకారాత్మను దయ చేసితివి, నీ విచ్చిన మన్నాను ఇయ్యక మానలేదు; వారి దాహమునకు ఉదకమిచ్చితివి.౹ 

21.నిజముగా అరణ్యములో ఏమియు తక్కువ కాకుండ నలువది సంవత్సరములు వారిని పోషించితివి. వారి వస్త్రములు పాతగిలిపోలేదు, వారి కాళ్లకువాపు రాలేదు.౹ 

22.ఇదియుగాక రాజ్యములను జనములను వారికప్పగించి, వారికి సరిహద్దులు ఏర్పరచితివి గనుక, వారు సీహోను అను హెష్బోను రాజుయొక్క దేశమును బాషానునకు రాజైన ఓగుయొక్క దేశమును స్వతంత్రించుకొనిరి.౹ 

23.వారి సంతతిని ఆకాశపు నక్షత్రములంత విస్తారముగా చేసి, ప్రవేశించి స్వతంత్రించుకొనునట్లు వారి పితరులకు నీవు వాగ్దానముచేసిన దేశములోనికి వారిని రప్పింపగా 

24.ఆ సంతతివారు ప్రవేశించి ఆ దేశమును స్వతంత్రించుకొనిరి. నీవు కనానీయులను ఆ దేశవాసులను జయించి, తమకు మనస్సువచ్చినట్లు చేయుటకు వారి రాజులను ఆ దేశజనులను వారి చేతికి అప్పగించితివి.౹ 

25.అప్పుడు వారు ప్రాకారములుగల పట్టణములను ఫలవంతమైన భూమిని స్వాధీనపరచుకొని, సకలమైన పదార్థములతో నిండియున్న యిండ్లను త్రవ్విన బావులను ద్రాక్షతోటలను ఒలీవతోటలను బహు విస్తారముగా ఫలించు చెట్లను వశపరచుకొనిరి. ఆలాగునవారుతిని తృప్తిపొంది మదించి నీ మహోపకారమునుబట్టి బహుగా సంతోషించిరి.౹ 

26.అయినను వారు అవిధేయులై నీ మీద తిరుగుబాటుచేసి, నీ ధర్మశాస్త్రమును లక్ష్యపెట్టక త్రోసివేసి, నీతట్టు తిరుగవలెనని తమకు ప్రకటన చేసిన నీ ప్రవక్తలను చంపి నీకు బహుగా విసుకు పుట్టించిరి.౹ 

27.అందుచేత నీవు వారిని వారి శత్రువులచేతికి అప్పగించితివి. ఆ శత్రువులు వారిని బాధింపగా శ్రమకాలమందువారు నీకు మొఱ్ఱపెట్టినప్పుడు ఆకాశమందుండు నీవు ఆలకించి, వారి శత్రువుల చేతిలోనుండి వారిని తప్పించుటకై నీ కృపాసంపత్తిని బట్టి వారికి రక్షకులను దయచేసితివి.౹ 

28.వారు నెమ్మదిపొందిన తరువాత నీ యెదుట మరల ద్రోహులుకాగా నీవు వారిని వారి శత్రువులచేతికి అప్పగించితివి; వీరు వారిమీద అధికారము చేసిరి. వారు తిరిగి వచ్చి నీకు మొఱ్ఱపెట్టినప్పుడు ఆకాశమందుండు నీవు ఆలకించి నీ కృపచొప్పున అనేకమారులు వారిని విడిపించితివి.౹ 

29.నీ ఆజ్ఞలను విధులను ఒకడు ఆచరించినయెడల వాటివలనవాడు బ్రదుకునుగదా. వారు మరల నీ ధర్మశాస్త్రము ననుసరించి నడుచునట్లు నీవు వారిమీద సాక్ష్యము పలికినను, వారు గర్వించి నీ ఆజ్ఞలకు లోబడక నీ విధుల విషయములో పాపులై నిన్ను తిరస్కరించి తమ మనస్సును కఠినపరచుకొని నీ మాట వినకపోయిరి.౹ 

30.నీవు అనేక సంవత్సరములు వారిని ఓర్చి, నీ ప్రవక్తలద్వారా నీ ఆత్మచేత వారిమీద సాక్ష్యము పలికితివిగాని వారు వినక పోయిరి; కాగా నీవు ఆయా దేశములలోనున్న జనులచేతికి వారిని అప్పగించితివి.౹ 

31.అయితే నీవు మహోప కారివై యుండి, వారిని బొత్తిగా నాశనముచేయకయు విడిచిపెట్టకయు ఉంటివి. నిజముగా నీవు కృపాకనికరములుగల దేవుడవైయున్నావు.౹ 

32.చేసిన నిబంధనను నిలు పుచు కృప చూపునట్టి మహాపరాక్రమశాలివియు భయంకరుడవునగు మా దేవా, అష్షూరు రాజుల దినములు మొదలుకొని యీ దినములవరకు మా మీదికిని మా రాజులమీదికిని ప్రధానులమీదికిని మా పితరులమీదికిని నీ జనులందరిమీదికిని వచ్చినశ్రమయంతయు నీ దృష్టికి అల్పముగా ఉండకుండును గాక.౹ 

33.మా మీదికి వచ్చినశ్రమ లన్నిటిని చూడగా నీవు న్యాయస్థుడవే; నీవు సత్యము గానే ప్రవర్తించితివి కాని మేము దుర్మార్గులమైతిమి.౹ 

34.మా రాజులుగాని మా ప్రధానులుగాని మా యాజకులుగాని మా పితరులుగాని నీ ధర్మశాస్త్రము ననుసరించి నడువలేదు. నీవు వారిమీద పలికిన సాక్ష్యములనైనను నీ ఆజ్ఞలనైనను వారు వినకపోయిరి.౹ 

35.వారు తమ రాజ్య పరిపాలనకాలమందు నీవు తమ యెడల చూపించిన గొప్ప ఉపకారములను తలంచక, నీవు వారికిచ్చిన విస్తారమగు ఫలవంతమైన భూమిని అనుభవించియుండియు నిన్ను సేవింపకపోయిరి, తమ చెడు నడతలువిడిచి మారుమనస్సు పొందరైరి.౹ 

36.చిత్తగించుము, నేడు మేము దాస్యములో ఉన్నాము, దాని ఫలమును దాని సమృద్ధిని అనుభవించునట్లు నీవు మా పితరులకు దయచేసిన భూమియందు మేము దాసులమై యున్నాము.౹ 

37.మా పాపములనుబట్టి నీవు మా మీద నియమించిన రాజులకు అది అతివిస్తారముగా ఫలమిచ్చుచున్నది. వారు తమకిష్టము వచ్చినట్లు మా శరీరములమీదను మా పశువులమీదను అధికారము చూపుచున్నారు గనుక మాకు చాల శ్రమలు కలుగుచున్నవి.

నెహెమ్యా 10

ప్రజల ఒప్పందం

1.మేము ఒప్పుకొని చెప్పినదానినిబట్టి ఒక స్థిరమైన నిబంధన చేసికొని వ్రాయించుకొనగా, మా ప్రధానులును లేవీయులును యాజకులును దానికి ముద్రలు వేసిరి. 

27-28.అయితే జనులలో మిగిలినవారు, అనగా దేవుని ధర్మశాస్త్రమునకు విధేయులగునట్లు దేశపు జనులలో ఉండకుండ తమ్మును తాము వేరుపరచుకొనిన యాజకులు లేవీయులు ద్వారపాలకులు గాయకులు నెతీనీయులు అందరును, దేవుని దాసుడైన మోషేద్వారా నియమించబడిన దేవుని ధర్మశాస్త్రము ననుసరించి నడుచుకొనుచు, మన ప్రభువైన యెహోవా నిబంధనలను కట్టడలను ఆచరించుదుమని శపథము పూని ప్రమాణము చేయుటకు కూడిరి.౹ 

29.వారి భార్యలు వారి కుమారులు వారి కుమార్తెలు తెలివియు బుద్ధియుగలవా రెవరో వారును ఈ విషయములో ప్రధానులైన తమ బంధువులతో కలిసిరి.౹ 

30.మరియు–మేము దేశపు జనులకు మా కుమార్తెలను ఇయ్యకయు వారి కుమార్తెలను మా కుమారులకు పుచ్చుకొనకయు నుందుమనియు 

31.దేశపు జనులు విశ్రాంతిదినమందు అమ్మకపు వస్తువులనేగాని భోజన పదార్థములనేగాని అమ్ముటకు తెచ్చినయెడల విశ్రాంతిదినమునగాని పరిశుద్ధ దినములలోగాని వాటిని కొనకుందుమనియు, ఏడవ సంవత్సరమున విడిచిపెట్టి ఆ సంవత్సరములో బాకీదారుల బాకీలు వదలివేయుదుమనియు నిర్ణయించుకొంటిమి.౹ 

32.మరియు మన దేవుని మందిరపు సేవనిమిత్తము ప్రతి సంవత్సరము తులము వెండిలో మూడవ వంతు ఇచ్చెదమని నిబంధన చేసికొంటిమి.౹ 

33.సవరింపబడిన రొట్టెవిషయములోను, నిత్య నైవేద్యము విషయములోను, నిత్యము అర్పించు దహనబలి విషయములోను, విశ్రాంతిదినముల విషయములోను, అమావాస్యల విషయములోను, నిర్ణయింపబడిన పండుగల విషయములోను, ప్రతిష్ఠితములైన వస్తువుల విషయములోను, ఇశ్రాయేలీయులకు ప్రాయశ్చిత్తము కలుగుటకైన పాపపరిహారార్థబలుల విషయములోను, మన దేవుని మందిరపు పనియంతటి విషయములోను, ఆలాగుననే నిర్ణయించుకొంటిమి.౹ 

34.మరియు మా పితరుల యింటి మర్యాదప్రకారము ప్రతి సంవత్సరమును నిర్ణయించుకొనిన కాలములలో ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాసియున్నట్టు మా దేవుడైన యెహోవా బలిపీఠముమీద దహింప జేయుటకు యాజకులలోను లేవీయులలోను జనులలోను కట్టెల అర్పణమును మా దేవుని మందిరములోనికి ఎవరు తేవలెనో వారును చీట్లువేసికొని నిర్ణయించు కొంటిమి.౹ 

35.మరియు మా భూమియొక్క ప్రథమ ఫలములను సకల వృక్షముల ప్రథమ ఫలములను, ప్రతి సంవత్సరము ప్రభువు మందిరమునకు మేము తీసికొని వచ్చునట్లుగా నిర్ణయించుకొంటిమి 

36.మా కుమారులలో జ్యేష్ఠపుత్రులు, మా పశువులలో తొలిచూలులను, ధర్మశాస్త్రగ్రంథమందు వ్రాయబడినట్టు మా మందలలో తొలిచూలులను, మన దేవుని మందిరములో సేవచేయు యాజకులయొద్దకు మేము తీసికొని వచ్చునట్లుగా నిర్ణయించుకొంటిమి.౹ 

37.ఇదియుగాక మా పిండిలో ప్రథమ ఫలము ప్రతిష్ఠార్పణలు సకల విధమైనవృక్షముల ఫలములు ద్రాక్షారసము నూనె మొద లైన వాటిని మా దేవుని మందిరపు గదులలోనికి యాజకుల యొద్దకు తెచ్చునట్లుగాను, మా భూమి పంటలో పదియవ వంతును లేవీయులయొద్దకు తీసికొని వచ్చునట్లుగా ప్రతి పట్టణములోనున్న మా పంటలో పదియవ వంతును ఆ లేవీయుల కిచ్చునట్లుగాను నిర్ణయించుకొంటిమి.౹ 

38.లేవీయులు ఆ పదియవ వంతును తీసికొనిరాగా అహరోను సంతతివాడైన యాజకుడు ఒకడును వారితోకూడ ఉండ వలెననియు, పదియవ వంతులలో ఒకవంతు లేవీయులు మా దేవుని మందిరములో ఉన్న ఖజానా గదులలోనికి తీసికొని రావలెననియు నిర్ణయించుకొంటిమి,౹ 

39.ఇశ్రాయేలీయులును లేవీయులును ధాన్యమును క్రొత్త ద్రాక్షారసమును నూనెను తేగా, సేవచేయు యాజకులును ద్వారపాలకులును గాయకులును వాటిని తీసికొని ప్రతిష్ఠితములగు ఉపకరణములుండు మందిరపు గదులలో ఉంచవలెను. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము.

నెహెమ్యా 12

యెరూషలేము యొక్క ప్రాకారమును ప్రతిష్టించుట

27.యెరూషలేము ప్రాకారమును ప్రతిష్ఠించు కాలములో వారు ఆ ప్రతిష్ఠాచారమును స్తోత్రగీతములతోను పాటలతోను స్వరమండల సితారా చేయి తాళములతోను సంతోషముగా జరిగించునట్లు లేవీయులను తమ సకల స్థలములలోనుండి యెరూషలేమునకు రప్పించుటకు పూను కొనిరి 

28.అప్పుడు గాయకుల వంశస్థులు యెరూషలేము చుట్టునున్న మైదాన భూమిలోనుండియు నెటోపాతియొక్క గ్రామములలోనుండియు కూడుకొని వచ్చిరి.౹ 

29.మరియు గిల్గాలుయొక్క యింటిలోనుండియు, గెబయొక్కయు అజ్మావెతుయొక్కయు పొలములలోనుండియు జనులు వచ్చిరి. ఏలయనగా యెరూషలేము చుట్టును గాయకులు తమకు ఊళ్లను కట్టుకొని యుండిరి.౹ 

30.యాజకులును లేవీయులును తమ్మును తాము పవిత్రపరచుకొనిన తరువాత జనులను గుమ్మములను ప్రాకారమును పవిత్రపరచిరి.౹ 

31.అటుతరువాత నేను యూదుల ప్రధానులను ప్రాకారముమీదికి తోడుకొని వచ్చి స్తోత్రగీతములు పాడువారిని రెండు గొప్ప సమూహములుగా ఏర్పరచితిని. అందులో ఒక సమూహము కుడిప్రక్కను పెంట గుమ్మము వైపున ప్రాకారముమీదను నడిచెను.౹ 

32.వారివెంబడి హోషయాయును యూదుల ప్రధానులలో సగముమందియును వెళ్లిరి.౹ 

33.మరియు అజర్యాయు ఎజ్రాయు మెషుల్లామును 

34.యూదాయు బెన్యామీనును షెమ యాయును యిర్మీయాయు అనువారు పోయిరి.౹ 

35.యాజకుల కుమారులలో కొందరు బాకాలు ఊదుచు పోయిరి; వారెవరనగా, ఆసాపు కుమారుడైన జక్కూరునకు పుట్టిన మీకాయా కనిన మత్తన్యాకు పుట్టిన షెమయా కుమారుడైన యోనాతానునకు పుట్టిన జెకర్యాయు 

36.అతని బంధువులగు షెమయా అజరేలు మిలలై గిలలై మాయి నెతనేలు యూదా హనానీ అనువారు. వీరు దైవజనుడగు దావీదుయొక్క వాద్యములను వాయించుచు పోయిరి; వారి ముందర శాస్త్రియగు ఎజ్రాయును నడిచెను.౹ 

37.వారికి ఎదురుగా ఉన్న ఊట గుమ్మముదగ్గర దావీదుపురముయొక్క మెట్లమీద దావీదు నగరును దాటి ప్రాకారము వెంబడి తూర్పువైపు నీటి గుమ్మమువరకు పోయిరి.౹ 

38.స్తోత్రగీతములు పాడువారి రెండవ సమూహము వారికి ఎదురుగా నడిచెను, వారివెంబడి నేనును వెళ్లితిని. ప్రాకారముమీదనున్న సగముమంది కొలుముల గోపురము అవతలనుండి వెడల్పు ప్రాకారమువరకు వెళ్లిరి.౹ 

39.మరియు వారు ఎఫ్రాయిము గుమ్మము అవతలనుండియు, పాత గుమ్మము అవతలనుండియు, మత్స్యపు గుమ్మము అవతల నుండియు, హనన్యేలు గోపురమునుండియు, మేయా గోపురమునుండియు, గొఱ్ఱెల గుమ్మమువరకు వెళ్లి బందీ గృహపు గుమ్మములో నిలిచిరి.౹ 

40.ఆప్రకారమే దేవుని మందిరములో స్తోత్రగీతములు పాడువారి రెండు సమూహములును నేనును, నాతోకూడ ఉన్న అధికారులలో సగముమందియు నిలిచియుంటిమి.౹ 

41.యాజకులగు ఎల్యాకీము మయశేయా మిన్యామీను మీకాయా ఎల్యోయేనై జెకర్యా హనన్యా బాకాలు పట్టుకొనిరి.౹ 

42.ఇజ్రహయా అనువాడు నడిపింపగా మయశేయా షెమయా ఎలియాజరు ఉజ్జీ యెహోహానాను మల్కీయా ఏలాము ఏజెరులను గాయకులు బిగ్గరగా పాడిరి.౹ 

43.మరియు దేవుడు తమకు మహానందము కలుగజేసెనని ఆ దినమునవారు గొప్ప బలులను అర్పించి సంతోషించిరి. వారి భార్యలు పిల్లలు కూడ సంతోషించిరి. అందువలన యెరూషలేములో పుట్టిన ఆనందధ్వని బహు దూరమునకు వినబడెను.

44.ఆ కాలమందు పదార్థములకును ప్రతిష్ఠార్పణలకును ప్రథమ ఫలములకును పదియవవంతుల సంబంధమైన వాటికిని ఏర్పడిన గదులమీద కొందరు నియమింపబడిరి, వారు యాజకుల కొరకును లేవీయులకొరకును ధర్మశాస్త్రాను సారముగా నిర్ణయింపబడిన భాగములను పట్టణముల పొలములనుండి సమకూర్చుటకు నియమింపబడిరి; సేవచేయుటకు నియమింపబడిన యాజకులనుబట్టియు, లేవీయులనుబట్టియు యూదులు సంతోషించిరి.౹ 

45.మరియు గాయకులును ద్వారపాలకులును దావీదును అతని కుమారుడైన సొలొమోనును ఆజ్ఞాపించినట్లు దేవునిగూర్చిన పనులను తమ శుద్ధినిగూర్చిన పనులను నెరవేర్చుచు వచ్చిరి.౹ 

46.పూర్వమందు దావీదు దినములలో గాయకుల విషయములోను స్తోత్రగీతముల విషయములోను పాటల విషయములోను ఆసాపు ప్రధానుడు.౹ 

47.జెరుబ్బాబెలు దినములలోనేమి నెహెమ్యా దినములలోనేమి ఇశ్రాయేలీయులందరును వారి వంతులచొప్పున గాయకులకును ద్వారపాలకులకును భోజనపదార్థములను అనుదినము ఇచ్చుచు వచ్చిరి. మరియు వారు లేవీయుల నిమిత్తము అర్పణలను ప్రతి ష్ఠించుచు వచ్చిరి. లేవీయులు అహరోను వంశస్థులకు వాటిని ప్రతిష్ఠించిరి.

నెహెమ్యా 13

నెహెమ్యా యొక్క తుది సంస్కరణలు

13 ఆ దినమందువారు మోషేగ్రంథము జనులకు చదివి వినిపించగా అందులో–అమ్మోనీయులుగాని మోయాబీయులుగాని దేవునియొక్క సమాజమును ఎన్నటికి చేరకూడదు.౹ 

2.వారు అన్నపానములు తీసికొని ఇశ్రాయేలీయులకు ఎదురుపడక వారిని శపించుమని బిలామును ప్రోత్సాహపరచిరి. అయినను మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చెనని వ్రాయబడినట్టు కనబడెను.౹ 

3.కాగా జనులు ధర్మశాస్త్రమును వినినప్పుడు మిశ్ర జనసమూహమును ఇశ్రాయేలీయులలోనుండి వెలివేసిరి.

4.ఇంతకుముందు మన దేవుని మందిరపు గదిమీద నిర్ణ యింపబడిన యాజకుడగు ఎల్యాషీబు టోబీయాతో బంధుత్వము కలుగజేసికొని 

5.నైవేద్యమును సాంబ్రాణిని పాత్రలను గింజలలో పదియవభాగమును క్రొత్త ద్రాక్షారసమును లేవీయులకును గాయకులకును ద్వారపాలకులకును ఏర్పడిన నూనెను యాజకులకు తేవలసిన ప్రతిష్ఠిత వస్తువులను పూర్వము ఉంచు స్థలమునొద్ద, అతనికి ఒక గొప్ప గదిని సిద్ధముచేసి యుండెను.౹ 

6.ఆ సమయములో నేను యెరూషలేములో ఉండలేదు. ఎందుకనగా బబులోను దేశపు రాజైన అర్తహషస్త యేలుబడియందు ముప్పది రెండవ సంవత్సరమున నేను రాజును దర్శించి కొన్నిదినములైన తరువాత రాజునొద్ద సెలవుపుచ్చుకొని 

7.యెరూషలేమునకు వచ్చి ఎల్యాషీబు దేవుని మందిరములో టోబీయాకు ఒక గది యేర్పరచి చేసిన కీడంతయు తెలిసికొని 

8.బహుగా దుఃఖపడి ఆ గదిలోనుండి టోబీయాయొక్క సామగ్రియంతయు అవతల పారవేసి, గదులన్నియు శుభ్రముచేయుడని ఆజ్ఞాపింపగా వారాలాగు చేసిరి.౹ 

9.పిమ్మట మందిరపు పాత్రలను నైవేద్య పదార్థములను సాంబ్రాణిని నేనక్కడికి మరల తెప్పించితిని.౹ 

10.మరియు లేవీయులకు రావలసిన పాళ్లు వారికి అందక పోవుటచేత సేవచేయు లేవీయులును గాయకులును తమ పొలములకు పారిపోయిరని తెలిసికొని 

11.నేను అధిపతులతో పోరాడి –దేవుని మందిరమును ఎందుకు లక్ష్యపెట్టలేదని అడిగి, వారిని సమకూర్చి తమ స్థలములలో ఉంచితిని.౹ 

12.అటు తరువాత యూదులందరును ధాన్య ద్రాక్షారసతైలములలో పదియవభాగమును ఖజానాలోనికి తెచ్చిరి.౹ 

13.నమ్మకముగల మనుష్యులని పేరు పొందిన షెలెమ్యా అను యాజకుని సాదోకు అను శాస్త్రిని లేవీయులలో పెదాయాను ఖజానామీద నేను కాపరులగా నియమించితిని; వారి చేతిక్రింద మత్తన్యా కుమారుడైన జక్కూరునకు పుట్టిన హానాను నియమింపబడెను; మరియు తమ సహోదరులకు ఆహారము పంచిపెట్టు పనివారికి నియమింపబడెను.౹ 

14.నా దేవా, ఈ విషయములో నన్ను జ్ఞాపక ముంచుకొని, నా దేవుని మందిరమునకు దాని ఆచారముల జరుగుబాటునకును నేను చేసిన ఉపకారములను మరువకుండుము.

15.ఆ దినములలో యూదులలో కొందరు విశ్రాంతిదినమున ద్రాక్షతొట్లను త్రొక్కుటయు, గింజలు తొట్లలో పోయుటయు, గాడిదలమీద బరువులు మోపుటయు, ద్రాక్షారసమును ద్రాక్షపండ్లను అంజూరపు పండ్లను నానా విధములైన బరువులను విశ్రాంతిదినమున యెరూషలేములోనికి తీసికొని వచ్చుటయు చూచి, యీ ఆహారవస్తువులను ఆ దినమున అమ్మినవారిని గద్దించితిని.౹ 

16.తూరుదేశస్థులును కాపురముండి, యెరూషలేములోను విశ్రాంతిదినములో యూదులకును చేపలు మొదలైన నానా విధ వస్తువులను తెచ్చి అమ్ముచుండిరి.౹ 

17.అంతట యూదుల ప్రధానులను నేనెదురాడి–విశ్రాంతిదినమును నిర్లక్ష్యపెట్టి మీ రెందుకు ఈ దుష్కార్యమును చేయుదురు? 

18.మీపితరులును ఇట్లు చేసి దేవునియొద్దనుండి మనమీదికిని యీ పట్టణస్థులమీదికిని కీడు రప్పింపలేదా? అయితే మీరు విశ్రాంతిదినమును నిర్లక్ష్యపెట్టి ఇశ్రాయేలీయులమీదికి కోపము మరి అధికముగా రప్పించుచున్నారని చెప్పితిని.౹ 

19.మరియు విశ్రాంతిదినమునకు ముందు చీకటి పడినప్పుడు యెరూషలేము గుమ్మములను మూసివేయవలెననియు, విశ్రాంతిదినము గడచువరకు వాటిని తియ్యకూడదనియు నేనాజ్ఞాపించితిని మరియు విశ్రాంతిదినమున ఏ బరువైనను లోపలికి రాకుండ గుమ్మములయొద్ద నా పనివారిలో కొందరిని కావలియుంచితిని.౹ 

20.వర్తకులును నానావిధములైన వస్తువులను అమ్మువారును ఒకటి రెండు మారులు యెరూషలేము అవతల బసచేసికొనగా 

21.నేను వారిని గద్దించి వారితో ఇట్లంటిని–మీరు గోడచాటున ఎందుకు బసచేసి కొంటిరి? మీరు ఇంకొకసారి ఈలాగు చేసినయెడల మిమ్మును పట్టుకొందునని చెప్పితిని; అప్పటినుండి విశ్రాంతిదినమునవారు మరి రాలేదు.౹ 

22.అప్పుడు తమ్మును తాము పవిత్రపరచుకొనవలెననియు, విశ్రాంతిదినమును ఆచరిం చుటకు వచ్చి గుమ్మములను కాచుకొనవలెననియు లేవీయులకు నేను ఆజ్ఞాపించితిని. నా దేవా, యిందునుగూర్చియు నన్ను జ్ఞాపకముంచుకొని నీ కృపాతిశయము చొప్పున నన్ను రక్షించుము.

23.ఆ దినములలో అష్డోదు అమ్మోను మోయాబు సంబంధు లైన స్త్రీలను వివాహము చేసికొనిన కొందరు యూదులు నాకు కనబడిరి.౹ 

24.వారి కుమారులలో సగము మంది అష్డోదు భాష మాటలాడువారు. వారు ఆయా భాషలు మాటలాడువారుగాని యూదుల భాష వారిలో ఎవరికిని రాదు.౹ 

25.అంతట నేను వారితో వాదించి వారిని శపించి కొందరిని కొట్టి వారి తలవెండ్రుకలను పెరికివేసి–మీరు వారి కుమారులకు మీ కుమార్తెలను ఇయ్యకయు, మీ కుమారులకైనను మీకైనను వారి కుమార్తెలను పుచ్చుకొనకయు ఉండవలెనని వారిచేత దేవుని పేరట ప్రమాణము చేయించి 

26.–ఇట్టి కార్యములు జరిగించి ఇశ్రాయేలీయుల రాజైన సొలొమోను పాపము చేయలేదా? అనేక జనములలో అతనివంటి రాజు లేకపోయినను, అతడు తన దేవునిచేత ప్రేమింపబడినవాడై ఇశ్రాయేలీయులందరిమీద రాజుగా నియమింపబడినను, అన్యస్త్రీలు అతనిచేత సహా పాపము చేయించలేదా? 

27.కాగా ఇంత గొప్పకీడుచేయునట్లును, మన దేవునికి విరోధముగా పాపము చేయునట్లును అన్యస్త్రీలను వివాహము చేసికొనిన మీవంటివారి మాటలను మేము ఆలకింపవచ్చునా? అని అడిగితిని.౹ 

28.ప్రధానయాజకుడును ఎల్యాషీబు కుమారుడునైన యోయాదా కుమారులలో ఒకడు హోరోనీయుడైన సన్బల్లటునకు అల్లుడాయెను. దానినిబట్టి నేను అతని నాయొద్దనుండి తరిమితిని.౹ 

29.నా దేవా, వారు యాజక ధర్మమును, యాజకధర్మపు నిబంధనను, లేవీయుల నిబంధనను అపవిత్రపరచిరి గనుక వారిని జ్ఞాపకముంచుకొనుము.౹ 

30.ఈలాగునవారు ఏ పరదేశులలోను కలియకుండ వారిని పవిత్రపరచి, ప్రతి యాజకుడును ప్రతి లేవీయుడును విధి ప్రకారముగా సేవచేయునట్లు నియమించితిని.౹ 

31.మరియు కావలసి వచ్చినప్పుడెల్ల కట్టెల అర్పణను ప్రథమ ఫలములను తీసికొని వచ్చునట్లుగా నేను నియమించితిని. నా దేవా, మేలుకై నన్ను జ్ఞాపకముంచుకొనుము.

Related Quiz Articles